ఎప్పుడో 140 సంవత్సరాల క్రితమే జమ్మూ కాశ్మీర్ డోగ్రా రాజు మహారాజా ప్రతాప్ సింగ్ తలపెట్టిన లక్ష్యం ఇన్నేళ్లకు నెరవేరింది
జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో చినాబ్, అంజిఖాడ్ రైల్వే వంతెనలను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు . ఈ వంతెనల ప్రారంభంతో భారతీయుల చిరకాల స్వప్నం నెరవేరిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు
ఈ రెండు వంతెనలు జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ – శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ లో కీలక భాగాలు. ఈ వంతెనల ప్రారంభంతో కాశ్మీర్ రైలు మార్గం భారతీయ రైల్వేలలో విలీనం అయ్యింది. దాంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది.
ఇక చినాబ్ వంతెన గురించి చెప్పుకోవాలంటే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి వంతెన ఇది. ఎత్తులో ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు మించిపోయింది. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో చినాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన పొడవు 1315 మీటర్లు. 28,660 మెగా టన్నుల ఉక్కు తో నిర్మించిన ఈ వంతెన జీవిత కాలం 120 సంవత్సరాలు అని అంచనా
ఇక ప్రధాని ప్రారంభించిన అంజిఖాడ్ వంతెన భారత దేశపు మొట్టమొదటి కేబుల్ – స్టెడ్ వంతెన. ఈ వంతెన కూడా రియాసి జిల్లాలోనే చినాబ్ నదికి ఉపనది అయిన అంజి నదిపై నిర్మించారు. చినాబ్ తర్వాత భారతదేశపు రెండో అతిపెద్ద ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకుంది
ఎత్తైన పర్వతాలు.. లోయల మీదుగా నిర్మించిన ఈ రెండు ప్రాజెక్టులు ఇంజనీరింగ్ అద్భుతాలుగా మిగిలిపోతాయి అనడంలో సందేహం లేదు
వంతెనల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్న కార్మికులు, ఇంజనీర్లు, అధికారులతో ముచ్చటించి వారిని అభినందించారు
పరేష్ తుర్లపాటి ✍️