చిరంజీవి బీజేపీలో జాయిన్ అవుతారా ? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వాఖ్యల ఆంతర్యం ఏంటి ?

Spread the love

చిరంజీవి బీజేపీలో జాయిన్ అవుతారా ? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాఖ్యల ఆంతర్యం ఏంటి ?

ఆదివారం మీడియాతో చిట్ చాట్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలు ప్రస్తుతం ఇటు  సినీ పరిశ్రమ వర్గాల్లోనూ .. అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది

బీజేపీలోకి సినీ నటులు రావడం కొత్త కాదని .. గతంలో కృష్ణం రాజు , విజయ శాంతి , కోట శ్రీనివాస రావు , సుమన్ , నరేష్ వంటి నటీ నటులు బీజేపీలో జాయిన్ అయి కొందరు కేంద్ర మంత్రులుగా పని చేయగా , మరికొందరు పార్టీ తరపున ప్రచారం చేశారని .. అలాగే ఇప్పుడు నేను పిలిచినా చిరంజీవి వచ్చేస్తారని వాఖ్యానించి సరి కొత్త చర్చకు తెర  లేపారు

నిజానికి చిరంజీవి మీద బీజేపీ కన్ను మాత్రమే కాదు అన్ని పార్టీల కళ్ళు పడ్డాయి

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి కూడా చేసిన చిరంజీవి ఆ తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి కెమెరా ముందుకు వచ్చి సినిమాలు చేసుకుంటున్నారు

అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఏపీలో క్రియాశీలక రాజకీయాలు  మొదలు పెట్టారు

ఈ నేపథ్యంలో వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..  చిరంజీవిని తాడేపల్లిలో తన ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేశారు

ఈ విందులో వైఎస్ జగన్ .. ఆయన సతీమణి స్వయంగా చిరంజీవికి కావాల్సిన ఐటమ్స్ కనుక్కుని వడ్డించారు

దరిమిలా వైసీపీ తరపున చిరంజీవికి రాజ్యసభ టికెట్ కంఫర్మ్  అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి

అయితే  చిరంజీవి ఈ వార్తలను అప్పట్లోనే కొట్టిపారేశారు

తర్వాత గోవాకు చెందిన ఓ కేంద్ర మంత్రి చిరంజీవిని బహిరంగంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు

అయినా చిరంజీవి మాత్రం స్పందించలేదు

ఇదిలా ఉండగా కిషన్ రెడ్డికి చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే

గతంలో ఢిల్లీలో తన నివాసంలో నిర్వహించిన సంక్రాతి వేడుకలకు కిషన్ రెడ్డి చిరంజీవిని కూడా ఆహ్వానించారు

ఈ వేడుకలకు హాజరు అయిన ప్రధాని మోదీ  చిరంజీవిని ఆద్యంతం తన పక్కనే నిలుపుకుని టాప్ ప్రయారిటీ ఇచ్చారు

ఆ సందర్భంలోనే కాదు ఏపీలో డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్  ప్రమాణ స్వీకార  వేదిక మీద కూడా మీ అన్నయ్య ఎక్కడ ? అంటూ పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని చిరంజీవి దగ్గరికి వెళ్లి అన్నదమ్ముల చేతులు పట్టుకుని గాల్లోకి లేపి విజయ సంకేతం ఇచ్చారు

ఎలా చూసినా బీజేపీ కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని వద్ద కూడా చిరంజీవికి మంచి పలుకుబడి ఉందన్న సంగతి కాదనలేని సత్యం

చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎలాగూ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పొత్తులో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం బీజేపీ పెద్దల కన్ను చిరంజీవి మీద పడింది

తెలంగాణాలో ఈసారి అధికారం దక్కించుకోవడానికి బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతుంది

ప్రస్తుతం బీజేపీలో తెలంగాణా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు ఎవరు అవుతారు అనే చర్చ నడుస్తుంది

ఆ పదవికి ఈటెల రాజేందర్ పేరు బయటికి వస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి వాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి

ఇదిలా ఉండగా ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రాకపోవచ్చని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి

అంతేకాదు పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆదుకుని  పెద్దన్న పాత్ర పోషిస్తున్న చిరంజీవిని వదులుకోవడానికి సినీ ఇండస్ట్రీ కూడా సుముఖంగా లేదు

ఏది ఏమైనా చిరంజీవి తాను  పిలవగానే వచ్చేస్తాడు అని  కిషన్ రెడ్డి  చేసిన వాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది

చిరంజీవి గురించి కిషన్ రెడ్డి కావాలని యధాలాపంగా చేసిన వాఖ్యలు కావని .. దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని బీజేపీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!