- షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు
- అధునాతన చికిత్సలతో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు
- డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సు ప్రారంభోత్సవంలో ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్, యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు
- వివిధ అంశాలపై జాతీయ స్థాయి వైద్య ప్రముఖుల ప్రసంగాలు.. సదస్సుకు హాజరైన 500 మందికి పైగా ప్రతినిధులు
- డాక్టర్ అమర్ పాల్ సింగ్ కు గోల్డ్ మెడల్ ప్రదానం
విజయవాడ: మధుమేహ వైద్యం అత్యంత ఆధునికతను సంతరించుకుందని, షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్, యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి సదాశివరావు అన్నారు.
యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండో కాన్ 2025 సదస్సు నిర్వహించారు.
లబ్బీపేటలోని హోటల్ జీఆర్టీ గ్రాండ్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో డాక్టర్ సదాశివరావు ప్రసంగిస్తూ” అధునాతన చికిత్సలతో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు విరబూస్తాయని అన్నారు. శరీర బరువు క్రమబద్ధీకరణకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యనిస్తున్నామని, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవడంతో పాటు గుండె జబ్బుల ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చని వివరించారు.
త్వరితగతిన శరీర బరువు తగ్గించేందుకు ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్ల నుంచి త్వరలో విముక్తి లభిస్తుందని, ఇన్సులిన్ సులువుగా తీసుకోగలిగేలా ఇన్హేలర్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
ఆధునిక వైద్య విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రతి ఏటా డయాబ్ ఎండో కాన్ సదస్సు నిర్వహిస్తూ వస్తున్నామని డాక్టర్ యలమంచి సదాశివరావు పేర్కొన్నారు.
ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి వైద్య నిపుణులు పలు అంశాలపై ప్రసంగించారు.
ఆధునిక చికిత్సా పద్ధతులు, నూతన ఆవిష్కరణల గురించి విశ్లేషించారు.
మధుమేహ నియంత్రణలో గట్ మేనేజ్మెంట్, ఆధునిక చికిత్సల ద్వారా డీ-యాక్సలరేషన్ మందుల వినియోగం తగ్గించడం, ఏఐ టెక్నాలజీ వినియోగం, టైప్-1 డయాబెటిస్ భవిష్యత్ చికిత్సలు, మధుమేహం ముప్పును వాయిదా వేయడం, కిడ్నీ వ్యాధులను తిప్పికొట్టడం, జీఐపీఆర్ ట్రీట్మెంట్ ద్వారా రక్తకణాల వ్యవస్థను సంరక్షించడం, ఆస్టియో పోరోసిస్ నిర్వహణ, ఫాటీ లివర్ నిర్ధారణ-చికిత్సలు, లాంగివిటీ ఇన్ డయాబెటిస్, అడల్ట్ వ్యాక్సినేషన్, క్యాన్సర్ మందుల క్యాన్సర్ మందుల కారణంగా సంతాన లేమి వంటి అనేక కీలక అంశాలపై సదస్సులో చర్చించారు.
ఈ ఏడాది ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ అమర్ పాల్ సింగ్ కు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు.
దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో వైడీఆర్ఎఫ్ జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ హిమన యలమంచి, సెక్రటరీ ఐశ్వర్య యలమంచి, జాయింట్ సెక్రటరీ అమూల్య యలమంచి తదితరులు పాల్గొన్నారు.