నేటి నుంచి విజయవాడలో ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ వార్షిక సదస్సు
ఎస్ఎస్ కన్వెన్షన్ నందు మూడు రోజుల పాటు కార్యక్రమాలు
సదస్సుకు హాజరుకానున్న 600 మంది ప్రతినిధులు
సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు
44వ వార్షిక సదస్సు బ్రోచర్లను ఆవిష్కరించిన ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ నలమాటి అమ్మన్న తదితరులు
విజయవాడ: మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక వైద్య చికిత్సల గురించి చర్చించేందుకు నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదిక కానుంది.
ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు డాక్టర్ నలమాటి అమ్మన్న తెలిపారు.
సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు.
సూర్యారావుపేటలో గురువారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ అమ్మన్న మాట్లాడుతూ ” శుక్రవారం సాయంత్రం జరిగే ప్రారంభోత్సవ వేడుకలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు.
అత్యాధునిక నెఫ్రాలజీ చికిత్సలు, ఆధునిక ఔషధాలు, నవీన ఆవిష్కరణ గురించి చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి విజ్ఞాన సర్వస్వంగా ఈ సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.
వివిధ అంశాలపై నిపుణుల ప్రసంగాలు, ఆధునిక చికిత్సా విధానాలపై విశ్లేషణలు, చికిత్సల్లో ఎదురయ్యే సంక్లిష్టతలపై సదస్సులో చర్చా కార్యక్రమాలు జరుగుతాయని డాక్టర్ అమ్మన్న వివరించారు.
దక్షిణ భారతదేశంలోని నెఫ్రాలజిస్టులకు, యువ వైద్య నిపుణులకు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సదస్సు గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధిక, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.