మీకో దండం .. మీ పార్టీకో దండం .. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ అలిగాడు !
హైదరాబాద్ గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ అలిగాడు
నిజానికి రాజాసింగ్ బీజేపీ మీద అలగడం ఇదే మొదటిసారి కాదు
గతంలో కూడా చాలాసార్లు అలిగాడు
అలాగే అలిగిన రాజా సింగ్ ను బుజ్జగించి పార్టీలోకి తీసుకురావడం బీజేపీకి కూడా ఇదే మొదటిసారి కాదు
గతంలో కూడా ఈ అలకలు.. బుజ్జగింపులు అయ్యాయి
పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం .. మళ్ళీ అలకవీడి తిరిగి పార్టీలోకి రావడం రాజాసింగ్ కు అలవాటే
బీజేపీ కూడా రాజాసింగ్ పట్ల మెతక వైఖరితో ఉండటానికి కారణం ఆయన ప్రత్యర్థి పార్టీల ప్రభంజనాన్ని తట్టుకుని మూడు సార్లు గోషా మహల్ ఎమ్మెల్యేగా గెలవడం ప్రధానమైనది
రాజాసింగ్ బీజేపీ పార్టీ తరపున కొంతకాలం శాసన సభలో విప్ గా కూడా పనిచేసారు
అయితే పార్టీలో సీనియర్ అయినప్పటికీ ఆయనకు సరైన అవకాశాలు రాకపోవడానికి ప్రధాన కారణం ఆయన క్రిమినల్ బ్యాక్ గ్రౌండే
రాజాసింగ్ మీద మొత్తం 105 క్రిమినల్ కేసులు ఉండగా అందులో 18 మతపరమైనవి ఉన్నాయి
2022 లో ముస్లిమ్స్ మీద వివాదాస్పద వాఖ్యలు చేసినందుకు బీజేపీ అధిష్టానం రాజా సింగ్ ను పార్టీనుంచి సస్పెండ్ చేసింది
2023 లో గోషామహల్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేశారు
2014 నుంచి 2025 వరకు మొత్తమ్మీద మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజాసింగ్ ఒకరకంగా పార్టీలో సీనియర్ నాయకుడే
అందుకే సీనియర్ నాయకుడినైన తనను పార్టీ పక్కనపెడుతుందని చాలాసార్లు బహిరంగంగా పార్టీ మీద అలిగారు
గతంలో తెలంగాణా బీజేపీ అధ్యక్షులుగా లక్ష్మణ్ ,బండి సంజయ్ , కిషన్ రెడ్డిలను నియమించినప్పుడు కూడా తనకు పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు రాజాసింగ్
తాజాగా టి బీజేపీలో కిషన్ రెడ్డి స్థానంలో నూతన అధ్యక్షుడి నియామకానికి పార్టీ నామినేషన్లు ఆహ్వానించడంతో రాజాసింగ్ కూడా బరిలోకి దిగి నామినేషన్ వేద్దామనుకున్నారు
కానీ పదిమంది మద్దతు దారుల సంతకాలు కూడా లేకపోవడంతో రాజాసింగ్ నామినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది
రాజాసింగ్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిస్తూ కేవలం ముగ్గురు మాత్రమే సంతకాలు పెట్టడంతో పార్టీ ఎలక్టోరల్ బాడీ రామచంద్ర రావు ను టీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించింది
దాంతో రాజాసింగ్ మళ్ళీ అలిగాడు
బీజేపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు
టీ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర రావు పేరు అనధికారికంగా ముందే డిసైడ్ చేసేశారని .. కావాలనే తన నామినేషన్ ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ రాజీనామా లేఖ కిషన్ రెడ్డికి పంపుతూ ‘ మీకో దండం .. మీ పార్టీకో దండం ‘ అన్నారు
గో సంరక్షకుడిగా హిందూ ధర్మాన్ని కాపాడే నాయకుడిగా ఎదుగుతున్న రాజాసింగ్ ఇప్పటికే టెర్రరిస్టుల హిట్ లిస్టులో కూడా ఉన్నారు
పార్టీకోసం ప్రాణాలకు తెగించి పనిచేసినా తనను చిన్నచూపు చూసారని ఆయన పార్టీ పెద్దలను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసారు
ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఎప్పటిలానే తిరిగి రాజాసింగ్ ను బుజ్జగించి అలక మానిపిస్తారా ? లేకపోతే రాజాసింగ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని పార్టీనుంచి ఆయన్ను సపెండ్ చేస్తారా ? ఒకవేళ సస్పెండ్ చేసినా తిరిగి పరిస్థితులు సద్దుమణిగాక పార్టీలోకి తిరిగి తీసుకువస్తారా ? అనేది తెలియాలంటే వేచి చూడాలి !