అంకితం
…
పుత్రికోత్సాహము తల్లికి తండ్రికి,
వారసులు జన్మించిన బుట్టదు,
జనులా పుత్ర పౌత్ర పుత్రికల పొగడగ
నాడెల్లరు పొందుర ఉత్సాహము ఇలలో సుమతీ!
బద్దెన కవి పద్దెము, మద్దెన విడగొట్టినందుకు క్షమించాలి. పితృస్వామ్య వ్యవస్థ వేళ్ళూనుకొని ఉన్న కాల౦లోనే, “సిరికిని, ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ… (ప్రతి భర్తకూ భార్యనే గొప్ప సంపద)” అంటూ స్త్రీకి ఎంతో గౌరవాన్ని ఇచ్చిన బద్దెన కవి కూడా ‘కొడుకు పుడితే తండ్రికి సంతోషం’ అన్నాడు.
సరే. అది అప్పటి మాట.
కాలం గడిచే కొద్దీ అభిప్రాయాలు మారతాయి కదా. “కద్దను వారికి కద్దు కద్దని మొఱల నిడు పెద్దల మాటలు నేడు అబద్ధమౌనో” అన్నాడు త్యాగరాజు. ఇప్పుడు కూతుళ్ళని కూడా కలపాలి. వాళ్ళూ సమాజంలో ఎదుగుతున్నారు..! తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు..! కొందరైతే వృద్ధులైన పెద్దలని కొడుకు కన్నా ఎక్కువగా ఆదుకుంటున్నారు కూడా..! అందుకే పై పద్యానికి సొంత పైత్యం చేర్చి కొంత మార్చాల్సి వచ్చింది.
మూడో ఆడపిల్ల పుట్టగానే “మహాలక్ష్మి ఈ సారి మనింటికి సరస్వతిని కూడా తెచ్చింది…” అంటూ సంతోషంగా స్వీట్లు పంచిన దంపతులు నాకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రా౦తాల్లో, కొన్ని కులాల్లో ఆడపిల్ల పుడితే సంతోషించే పరిస్థితి లేదు. “ఆడపిల్ల ‘ఆడ’పిల్లే గానీ, ఈడ పిల్ల కాదు కదా. ఆడికి పోయే పిల్లకి ఈడ బువ్వ ఎందుకు? పైగా కట్నం దండగ” అనే మెంటాలిటీలతో ఉంటారు కొందరు.
టెలివిజన్ నటి, మాజీ కేంద్ర మంత్రి, గతంలో రాహుల్ గాంధీ మీద పోటీ చేసి గెలిచిన స్మృతీ ఇరానీ ఒక కథ చెప్పింది:
… … …
కచ్ ప్రాంతపు పాకిస్తాన్ సరిహద్దు గ్రామంలో ఒక స్త్రీ. పేరు కమలా బెన్ అనుకుందాం. అప్పటికే ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. మళ్ళీ గర్భం. పుట్టేది అబ్బాయి అనుకుంటూ ఆర్నెలలు కలలు కన్నారు. ఆ బిడ్డ కూడా అమ్మాయే అయ్యేసరికి, కుటుంబం మొత్తం నిరాశలో మునిగి పోయింది.
రాజస్థాన్- మారుమూల ఎడారి గ్రామాల కుటుంబాల్లో స్త్రీలను చాలా చిన్న చూపు చూస్తారు. ఆడపిల్ల పుట్టడం అసలిష్టం ఉండదు. దురదృష్టవశాత్తు కమలా బెన్ అటువంటి పురుషాధిక్య సమాజపు ఇంటి కోడలు. ఇంటి చుట్టూ ఇసుక. ఇంటి వారి మనసుల్లోనూ ఇసుకే.
ఆమె అత్తా మామలు ఆ పసికందు మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. పిల్లని పెంచటానికి భర్త ఒప్పుకోలేదు. చివరికి ఆమె తల్లిదండ్రులు కూడా గుక్కెడు పాలు పోసి పాపని పెద్ద చెయ్యటానికి నిస్సహాయత వ్యక్తం చేశారు.
అందరూ మూకుమ్మడిగా కలిసి ఆ ముక్కు పచ్చలారని పాపని చంపెయ్యమన్నారు. కనులు విప్పి ప్రపంచం ఇంకా చూడని పసికందు ఈ ప్రపంచంలో ఉండకూడదన్నారు.
తల్లికి ఇంకో దారి లేదు. ఆమె ఒక్కత్తె. వారు పదిమంది.
సంసారం కోసం, మిగతా పిల్లల మనుగడ కోసం, కడుపు తీపి చంపుకుని, కన్నీళ్ళని దిగమింగుకుని, బొడ్డు ఊడని ఆ పసికందుని ఆ రాత్రి ఆరు బయట వసారాలో పడుకోబెట్టి లోపలికి వచ్చేసింది.
నీళ్ళు గడ్డకట్టే చలికాలం అది. రెండు స్వెటర్లు వేసుకుంటే తప్ప పెద్దలు కూడా తట్టుకోలేని రాజస్థాన్ చలి ఎడారి అది..! శూలాలు గుచ్చే శీతల పవనాల మధ్య, పై ఆచ్ఛాదన లేకుండా ఆ పసికందుని పడుకో బెడితే, తెల్లవారేసరికి రక్తం గడ్డకట్టి ప్రాణం విడుస్తుందని పెద్దల అంచనా.
ఎముకలు కొరికే చలిలో… బయట వసారాలో… రాత్ర౦తా మరణంతో పోరాడుతూ ఒక చిన్నారి..! లోపలి గదిలో ఆ పసిగుడ్డు మరణం కోసం ఎదురు చూస్తూ ఒక తల్లి..! ఎవరన్నారు మన జీవితాల్లో డ్రామా లేదని..?
తెల్లవారింది. ‘చనిపోయిందా? నా పసికూన శరీరం గడ్డ కట్టుకు పోయిందా..?’ అనుకుంటూ… గుండె గొంతులో కొట్టుకుంటూ… దుఃఖంతో, ఉద్వేగంతో వెళ్లి చూసింది తల్లి. కానీ చాలా ఆశ్చర్యంగా…
ఆ పిల్ల చనిపోలేదు.
తల్లిని చూసి ఆత్మీయంగా పలకరిస్తూ నవ్విందా? కన్నతల్లి కన్నీటి పొర వెనుక కనపడలేదు.
వత్తు గుడ్డలతో పాపని హృదయానికి హత్తుకుని, “…బతకాలన్న చిన్న ఆశతో నా కూతురు ఇంతటి చలిని జయించినప్పుడు, నా చిట్టితల్లి కోసం నేను జీవితాన్ని జయించలేనా?” అనుకుంది ఆ తల్లి.
తన ముగ్గురు బిడ్డలతో బయటికి వచ్చేసి స్వతంత్రంగా జీవించటం ప్రారంభించింది. తన కాళ్ళ మీద నిలబడి, ముగ్గురు అమ్మాయిల్నీ మంచి స్కూల్లో చదివి౦చింది. ప్రస్తుతం పెద్దమ్మాయి అదే స్కూల్లో టీచరు. మిగతా ఇద్దరు పిల్లలూ ఇంకా చదువుకుంటున్నారు.
** ** **
ఈ కథ ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనదేశంలో చాలా ప్రాంతాల్లో అమ్మాయిని కనడం, పెంచడం, చదివించడం ఇప్పటికీ ఒక సమస్యే..! అందులోనూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలని పెంచటం మరీ కష్టం..!
అలాంటి వైకల్యం ఉన్న పాప గురించిన పుస్తకం ఇది. “రన్ దీప్తీ. రన్”.
దీన్ని ఎవరికి అంకితం ఇవ్వాలి? “బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూళల కిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ హాలికులైన నేమి?” అన్నాడు పోతన. పేరున్నవారికి పేరు కోసం, ధనవంతులిచ్చే దానం కోసం అంకితం ఇవ్వటం ఎందుకు? అర్హులకి ఇవ్వాలి.
‘పది’ సంవత్సరాలు కృషి చేసి ఎన్నో మెడల్స్ సంపాదించింది దీప్తి. మంచిదే..! అభినందనీయమే..! కానీ చూడటానికి అందంగా లేక, ముద్దగా తప్ప మాట ముద్దుగా రాక, ముప్పు తిప్పలు పెట్టిన ఒక దివ్యా౦గురాలిని ‘ఇ..ర..వై’ సంవత్సరాలు పెంచి పెద్ద చేయటమంటే మాటలు కాదు. అంతే కాదు. ఆమె శక్తి మీద నమ్మకం ఉంచి, తమ జీవనాధారమైన ఇల్లు, పొలం అమ్మేసి, కూతుర్ని పోటీలకి తీర్చి దిద్దారు.
మనసూ, మెదడూ ఎదగని ఇలాంటి పిల్లల కథలు పేపర్లలో చదివి, ‘అహా-ఓహొ’ అని మెచ్చుకోవటానికి బావుంటాయి గానీ, పెంచటంలో ఉండే కష్టనష్టాలు ప్రాక్టికల్గా అనుభవిస్తేనే గానీ అర్థం కావు.
ఆ విధంగా ఆలోచిస్తే… ఈ అద్భుతమైన గెలుపుకి అమ్మాయిని కాదు..! ముందుగా ఆ పాప తల్లిదండ్రులని అభినందించాలి..!
అందుకే ఈ పుస్తకం వారికి అంకితం.
** ** **
ఈ రోజే రిలీజయిన ఈ పుస్తక౦ కోసం (ధర 250/- పోస్టు ఖర్చులతో కలిపి) https://payments.cashfree.com/forms/run-deepthi-run క్లిక్ చెయ్యండి. లేదా ‘అచ్చంగా తెలుగు’ భావరాజు పద్మిని (8558899478) గారికి ఫోన్ చెయ్యండి. ఈ పుస్తకం పై వచ్చే రాయల్టీ మొత్తం అభయం ఫౌండేషన్ కి వెళ్తుంది.
