శివాజీ వేసిన ‘దండోరా’ ఏంటి ?-మూవీ రివ్యూ

Spread the love

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో శివాజీ మాట్లాడుతూ ఓ రెండు పదాలతో ‘టముకు’ వేయడంతో సోషల్ మీడియా అంతా ఎటువంటి డప్పు కొట్టకుండానే ఫ్రీగా ‘దండోరా’ అయ్యింది .

సినిమా గురించి చెప్పుకునేముందు అసలు ఈ దండోరా అనే పదం గురించి కూడా రెండు మాటలు చెప్పుకుందాం . ఈ దండోరా అనేది పల్లెల్లో ఎక్కువగా వినపడే పదం . గ్రామపెద్దలు ఊళ్ళో ఏదైనా విషయాన్ని చాటింపు చేసేటప్పుడు డప్పు మాస్టర్ కి పనప్పచెబుతారు . అతడు డప్పు కొట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ సదరు విషయాన్ని చాటింపు చేస్తాడు .

మొదట్లో గ్రామాల్లో ఈ దండోరా ప్రముఖ పాత్ర వహించేది . ఏ సాంకేతికత లేని రోజుల్లో ఊరందరికీ సమాచారాన్ని చేరవేసే ఏకైక సాధనం డప్పు దండోరానే . దీన్నే టముకు వేయడం అని కూడా అంటారు .

‘ఇందుమూలంగా యావన్మందికీ తెలియచేయునది ఏమనగా రేపు ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఉందని పుర ప్రజలకు తెలియచేయడమైనదహో’ అంటూ అన్ని రోడ్లు తిరుగుతూ డప్పు కొట్టి చెప్పేవారు .

ఇదంతా అధికారిక కార్యక్రమాలకు.. అనధికార కార్యక్రమాల కోసం కూడా గ్రామాల్లో దండోరా వేస్తారు
ఇవి ఎక్కువగా ఊరి పెద్దల తీర్మానాలతో ఉంటాయి .

ఈ దండోరా వేశారంటే ఎవరికో మూడిందని అర్ధం . కులవివక్ష సంఘటనలలో ఈ డప్పు పాత్ర ఎక్కువగా ఉంటుంది . ఫలానా వాడ్ని ఊరినుంచి వెలివేసామనో , ఫలానా కులం వాళ్ళకి ఆంక్షలు విధిస్తున్నామనో చాటింపు వేసేవారు .

దీన్నిబట్టి ఇప్పుడు ఈ టైటిల్ వినగానే మీకు సినిమా ఇతివృత్తం అర్ధమయ్యే ఉంటుంది.
అయినా సరే ఇప్పుడు కధేంటో చెప్పుకుందాం .

కథ ఏంటంటే ?

కథ 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మెదక్ జిల్లా తుళ్లూరు గ్రామ నేపథ్యంతో మొదలౌతుంది . అప్పట్లో గ్రామాల్లో ఎలాంటి వాతావరణం ఉండేదో అందరికీ తెలిసిందే కదా . కుల వివక్ష .. కుల అహంకారం .. పరువు హత్యలు సాధారణంగా ఉండేవి . ఆ మాటకొస్తే ఇప్పటికీ అక్కడక్కడా ఉన్నాయనుకోండి .

అలా తుళ్లూరు గ్రామంలో కూడా కుల వివక్షలు ఉన్నాయి . ఊరిలో అగ్రవర్ణానికి చెందిన శివాజీ (శివాజీ ) పెద్ద రైతు . ఈయనొకొక కొడుకు విష్ణు (నందు) , కూతురు సుజాత (మనిక) .

కూతురు తక్కువ కులానికి చెందిన రవిని (రవికృష్ణ) ప్రేమిస్తుందని తెలిసి శివాజీ కులపెద్దలతో కలిసి అతడిని హత్య చేయిస్తాడు . తండ్రిలోని కుల వివక్షను గమనించిన కొడుకు కూడా అతడికి దూరం ఉంటాడు . ఈ పరిస్థితుల్లో శివాజీ శ్రీలత (బిందు మాధవి) అనే వేశ్యకు దగ్గరౌతాడు
తన తప్పును తెలుసుకుని కుమిలిపోయి మరణిస్తాడు .

దాంతో శివాజీ అంత్యక్రియలు తమ కుల సంఘానికి చెందిన స్మశానవాటికలో జరపటానికి వీల్లేదని అతడి కులానికే చెందిన పెద్దలు తీర్మానం చేస్తారు . ఈ పరిస్థితుల్లో అతడి కుటుంబ సభ్యులు మరియు ఊరి సర్పంచ్ (నవదీప్) కలిసి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ?

శివాజీకి వేశ్య శ్రీలతకు సంబంధం ఏంటి ?

తమ కులానికే చెందిన శివాజీ అంత్యక్రియలు జరపటానికి కులపెద్దలు ఎందుకు అడ్డు పడతారు ? తదితర విషయాలు మిగిలిన కథనంలో తెలుస్తాయి .

ఎలా ఉందంటే ?

టూకీగా కథ వినగానే కుల వివక్ష , పరువు హత్యల గురించి పాత సినిమాల్లో ఎప్పుడో చూసేసాం అనుకుంటున్నారా ? నిజమే , సబ్జెక్టు అదే కానీ ప్రెజెంటేషన్ డిఫరెంట్ . సాధారణంగా కులవివక్ష కేసుల్లో అణగారిన వర్గాలకు చెందిన బాధితుల తరపున కథనాలు ఎక్కువగా ఉంటాయి .

ఇదంతా గతంలో చాలా సినిమాల్లో చూసాం . ఉప్పెన , పలాస వంటి సినిమాల్లో ఈ కథలను ఆల్రెడీ చూపించేసారు . ఆ మధ్య వచ్చిన సుహాస్ ఉప్పుకప్పురంబు సినిమా కూడా శ్మశానాల గొడవ నేపథ్యంలోనే ఉంటుంది . కొద్దోగొప్పో ఆ సినిమాలో కొన్నిసన్నివేశాలు గురుకొస్తాయి .

అందుకే దర్శకుడు దండోరాలో అగ్రవర్ణాల్లో కూడా బాధితులను తీసుకుని కథను అల్లుకుని తెరకెక్కించడంలో కొత్త కోణంలో చూస్తున్నట్టు అనిపిస్తుంది . అదే ఈ సినిమాకి ప్లస్సు .

సుహాస్ తో కలర్ ఫోటో మూవీ తీసిన నిర్మాణ సంస్థే దండోరా కూడా తీసింది . కలర్ ఫోటో కూడా వివక్ష ఆధారంగా అల్లుకున్న కథతో తీసిన సినిమానే అయినా వసూళ్లపరంగా కలెక్షన్లను బాగానే రాబట్టింది.

అదే కాన్సెప్ట్ తో ఇంకొంచెం డిఫరెంట్ గా దండోరా సినిమా తీయడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మాములుగా అయితే ఇటువంటి సందేశాత్మక సినిమాలు ట్రైలర్ కు తక్కువ , డాక్యూమెంటరీకి ఎక్కువ అన్నట్టుగా ఉంటాయి .

అందుకే భావం చెడకుండా కమర్షియల్ హంగులతో తీయాలంటే కొంచెం శ్రద్ద పెట్టాలి.
దర్శకుడు ఆ పరంగా సక్సెస్ అయ్యాడు .

ఇక గ్రామాల్లో కుల వివక్షలు , శ్మశానాల గొడవ ఎప్పట్నుంచో ఉన్నవే . ఆరడుగుల స్థలం కోసం కారంచేడులో అగ్రవర్ణాలకు , దళితులకు మధ్య జరిగిన మారణకాండ ఇప్పటికీ చెరిగిపోని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది . అగ్ర కులాలకు ఊళ్ళో స్మశానాలు ఉండటం , అణగారిన వర్గాలకు ఊరి బయట స్మశానాలు ఉండటం వంటి నిజ జీవిత సంఘటనలను దండోరా ప్రతిబింభిస్తుంది .

సినిమా ప్రారంభమే ఓ ముసలి అవ్వ శవాన్ని నలుగురు మోసుకుని ఊరి బయట స్మశానానికి తీసుకెళ్లడంతో మొదలౌతుంది . అయితే ఈ సినిమాలో అగ్రవర్ణానికి చెందిన శివాజీ కూడా కుల వివక్షను ఎదుర్కొని బాధితుడిగా చూపించటం అనేది మరో కోణం .

ఒక్కోసారి శివాజీ పాత్రను చూస్తుంటే పరువు హత్య చేసి చిన్నాభిన్నం అయిన మారుతీరావు కూడా గుర్తుకొస్తాడు . ఇంకొన్నిసార్లు కోర్ట్ మూవీలో మంగపతిరావు పాత్ర ఇందులో కంటిన్యూ అవుతుందా? అని కూడా అనిపిస్తుంది .

పరువు హత్య చేసినతర్వాత శివాజీ కుటుంబంలో పడ్డ అవమానాలు , మానసిక వేదనలను చూపించారు . కుల దురహంకారంతో తప్పు చేస్తే అగ్రవర్ణాలు అయినా సరే బాధితులు అవుతారనే పాయింట్ ఎస్టాబ్లిష్ చేసారు .

బతికున్నప్పుడు ఎలాగూ కులాల కుంపట్లు పెట్టుకుని తన్నుకు చచ్చే మనుషులు చనిపోయిన తర్వాత కూడా అదే కులాల వల్ల పడే ఇబ్బందులు , వివక్షలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూనే వాటికీ వ్యతిరేకంగా పరిష్కారమార్గం చూపుతూ దర్శకుడు కొట్టిన డప్పే దండోరా .

అన్నిటికన్నా ముఖ్యం పదునైన సంభాషణలు ఈ సినిమాకి జీవం పోశాయి . చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద లాంటి డైలాగులతో ఎమోషన్లు బాగా పండించారు .

అయితే ప్రథమార్థంలో రవితో శివాజీ కూతురి ప్రేమ ,పాటలు .. వేశ్యతో శివాజీ సన్నివేశాలు , నవదీప్ కామెడీ సన్నివేశాలతో నడిచిపోవడంతో కథలోకి వెళ్తున్న భావన రాదు. అక్కడక్కడా అవసరం లేని కొన్నిసాగదీత సన్నివేశాలు ఉన్నాయి .

వేశ్య సాంగత్యంలో శివాజీలో వచ్చిన మార్పుతో అసలు కథలోకి వెళ్తాం . ప్రధమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో కథ పరుగులుపెడుతుంది .

ఎవరెలా చేసారంటే ?

దండోరా గురించి చెప్పుకోవాలంటే ముందు శివాజీ గురించి చెప్పుకోవాలి . మొత్తం సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు .

కోర్ట్ మూవీలోని మంగపతి పాత్రతోనే శివాజీలోని నటుడు మరోమెట్టుపైకి వచ్చాడు . ఇక ఈ సినిమాలో అదే పెర్ఫార్మన్స్ కంటిన్యూ చేసాడు . శివాజీ స్థానంలో వేరొకరు చేసినా ఆ పాత్ర ఇంత రక్తి కట్టేది కాదేమో?

టైటిల్స్ లో నవదీప్ 2.0 అని వేశారు. అంటే దానర్థం బహుశా నవదీప్ సెకండ్ ఇన్నింగ్స్ అనేమో..
ఈ మధ్య అతడి సినిమాలు తగ్గిపోయాయి కదా అందుచేత అయ్యుంటుంది . ఏమాటకామాటే చెప్పుకోవాలి నవదీప్ లో కూడా చక్కటి నటుడు ఉన్నాడు . కాకపోతే సర్పంచ్ పాత్రలో అతడ్ని పూర్తిగా వాడుకోలేకపోయారు అనిపిస్తుంది . దానికి కారణం బహుశా అతడితో చేయించిన కొన్ని అతి కామెడీ సన్నివేశాలేమో ?

వేశ్య పాత్రలో బిందుమాధవి వల్గర్గా కాకుండా హుందాగా కనిపిస్తుంది . ఆ క్యారక్టరైజేషనే బిందుమాధవి పాత్రకు హైలెట్ .

రవికృష్ణ , మణికల నటన కూడా సహజంగానే ఉంది . నందు నటన కూడా వంక పెట్టాల్సిన పనిలేదు . బాగానే ఉంది .

ఓవరాల్ గా ఎవరెలా చూసారని తరచి చూసుకుంటే ప్రతి పాత్ర మీదా దర్శకుడు పెట్టిన ప్రత్యేక శ్రద్ద కనిపిస్తుంది . ఏ పాత్రకు ఆ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నట్టున్నాడు .

సాంకేతికంగా ఎలా ఉంది ?

మార్క్ కె రాబిన్ సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది . దండోరా పాట బావుంది .

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఇలాంటి సినిమాలకు కెమెరా పనితనం చాలా అవసరం
వెంకట్ ఆర్ శాఖమూరి ఆ పనితనం బాగానే చూపించారు .

నిర్మాణ విలువలు ఓకే .

దర్శకుడు మురళికాంత్ కుల వివక్ష సబ్జెక్టు మీద కొత్త పాయింట్ రాసుకుని అల్లుకున్న కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో రొటీన్ ఫీలింగ్ నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది .

నటీనటులు : శివాజీ , నందు , నవదీప్ , బిందుమాధవి , రవికృష్ణ తదితరులు
సంగీతం : మార్క్ కె రాబిన్
దర్శకత్వం : మురళికాంత్
విడుదల : 25 – 12 – 2025
రేటింగ్ : 3 / 5


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!