శత్రువును జయించాలంటే యుద్ధమే చెయ్యక్కర్లేదు .. ఒక్కోసారి వ్యూహాత్మక మౌనంతో కూడా గెలవొచ్చు .. మోడీ చేసింది అదే !

Spread the love

అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో మార్పుల సంగతి ఏమో కానీ ప్రపంచ వ్యాప్తంగా దౌత్య సంబంధాల్లో మార్పులు వచ్చాయి . అధికారంలోకి రావడంతోనే ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎత్తుకున్నారు . అమెరికాని అన్ని విధాలా పరిపుష్టం చేస్తామని దానర్థం . గాడి తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి డాలర్ ను మరింత శక్తిమంతం చేస్తామని ఆయన చెప్పారు .

నిజానికి ఇవన్నీ అమెరికన్లకు నచ్చేవే .. అమెరికన్లు మెచ్చేవే .. ట్రంప్ ఆ దిశగా ముందుకెళ్లి ఉంటే నిజంగా అమెరికా చరిత్రలో ఆయన పేరు నిలిచిపోయి ఉండేది . కానీ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదం పేరుతో తొందరపాటులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి . యూఎస్ మీద పెట్టాల్సిన ఫోకస్ ఇతర దేశాలమీదకు మళ్లింది . అమెరికాతో వాణిజ్య సంబంధాలు కొనసాగాలంటే తాము విధించే టారిఫ్ మేరకు సుంకాలు చెల్లించాల్సిందే అని కొత్త నిబంధన తీసుకొచ్చారు .

ట్రంప్ అకస్మాత్తుగా పెంచిన సుంకాల ధాటికి చాలా దేశాలు షాక్ అయి ఆ ప్రతిపాదనలను వ్యతిరేకించారు కూడా.. కేవలం సుంకాలు విధించడమే కాదు.. తమ మాట వినని దేశాలపై అత్యధిక టారిఫ్ లు విధిస్తామని ఆయన హెచ్చరిక కూడా చేసారు.. దీంతో దౌత్యపరంగా చాలా దేశాలతో సంబంధాలు బెడిసికొట్టాయి . అమెరికా ఫస్ట్ నినాదం పేరిట ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం భారత్ మీద కూడా గణనీయంగా పడింది .

అమెరికాలో ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లిన విద్యార్థులు కానివ్వండి .. అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారు కానివ్వండి.. భారతీయుల శాతం ఎక్కువే .. అయితే ట్రంప్ నిర్ణయాల ప్రభావం వేలాదిమంది భారతీయుల మీద పడింది.. ఆ ఒత్తిడి భారత ప్రభుత్వం మీద కూడా పడింది .

అధికారుల స్థాయిలో దౌత్య ప్రయత్నాలు చేసినా అమెరికా దిగిరాలేదు .. అది యూఎస్ గవర్నమెంట్ పాలసీ కాబట్టి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది .

కానీ ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల మీద భారత సైన్యం చేసిన దాడుల తర్వాత జరిగిన కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్దాన్ని తానే ఆపించానని ట్రంప్ పదే పదే చెప్పుకొచ్చారు . కానీ భారత సైన్యం తాము ఎవరి ప్రమేయంతోనో కాల్పుల విరమణ పాటించలేదని , పాక్ సైనికాధికారులు ప్రాధేయపడటంతోనే విరామం ఇచ్చామని స్పృష్టం చేసారు .

మొదటిసారిగా భారత్ , యూఎస్ సంబంధాల్లో మార్పు వచ్చింది అక్కడే .. దానికన్నా ముందు ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం ప్రయోగించిన ఆయుధాల్లో రష్యా ఉత్పత్తులు ఉండటం అమెరికాకు నచ్చలేదు . ఆసియాలో భారత్ చాలా పెద్ద మార్కెట్ అని అమెరికాకు కూడా తెలుసు .

అటువంటి భారత్ మేజర్ వాణిజ్య ఒప్పందాలు ఎక్కువగా రష్యాతోనే చేసుకోవడం సహజంగా అమెరికాకు కంటగింపు అయ్యింది . మరీ ముఖ్యంగా ఆయుధ ఒప్పందాల కన్నా రష్యాతో చేసుకున్న ముడి చమురు ఒప్పందాలు యూఎస్ కు నచ్చలేదు . ప్రపంచ వ్యాప్తంగా డాలర్ ను బలోపేతం చేసే వాణిజ్యాలలో ముడి చమురు ఒకటి.. అందుకే ట్రంప్ భారత్ కు రష్యా ముడి చమురుకు లింక్ పెడుతూ కొన్ని కండిషన్స్ పెట్టాడు . ఆ కండిషన్స్ ప్రకారం భారత్ రష్యాతో ముడి చమురు ఒప్పందం నిలిపివేయాలి.. తమ మాట కాదని భారత్ మొండిగా ముందుకెళ్తే 50 శాతం సుంకాలను విధిస్తామని ఆయన హెచ్చరించారు . మోడీ నా ఫ్రెండ్ అంటూ ఒకటికి పదిసార్లు అంటూనే ఆయన పని ఆయన చేసుకుంటూ పోయారు .

ఇవన్నీ ట్రంప్ తరపున భారత్ ను చికాకు పెట్టే నిర్ణయాలు .. ముఖ్యంగా మోడీని వ్యక్తిగతంగా ఇరుకున పెట్టే నిర్ణయాలు .

మరి ఇంత జరుగుతున్నా మోడీ మౌనంగా చూస్తూ ఉండిపోయారా ?

ఎస్ .. మౌనంగా ఉన్నారు కానీ చూస్తూ ఉండిపోలేదు.. ఒక్కోసారి శత్రువును దెబ్బకొట్టాలంటే ఆయుధాలే అవసరం లేదు.. వ్యూహాత్మక మౌనంతో కూడా దెబ్బ కొట్టొచ్చు .

మోడీ చేసిన పని అదే ,

ట్రంప్ తన దోవన తాను రోజుకో మాట చెప్పుకుంటూ పోయాడు.. మోడీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా భారీ వ్యూహం పన్నారు .

నిజానికి ఇదో గేమ్
మైండ్ గేమ్ .

ఈ మైండ్ గేమ్ లో ఆవేశకావేశాలకు పోకుండా కూల్ గా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఆడేవాడే విజేత అవుతాడు . అమెరికా దూకుడికి ప్రపంచ దేశాలు అరుస్తుండగా , మోడీ నిశ్శబ్దంగా చైనాలో మంత్రాంగం నడిపారు .

నిజానికి అమెరికాకన్నా చైనాలోనే మనకు శత్రుత్వం ఎక్కువ.. కానీ చైనాకు అమెరికాతో కూడా శత్రుత్వం ఎక్కువే .. శత్రువు , శత్రువు మరొకరికి మిత్రుడు అవుతాడన్న చందాన ఏడేళ్ల తర్వాత మోడీ చైనా వెళ్లి జిన్ పింగ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారు . అక్కడే అమెరికా ఇంకో శత్రువు రష్యా కూడా కలిసింది . ఇంటర్నేషనల్ మీడియా కూడా సమావేశ వివరాలకన్నా ఈ ముగ్గురి భేటీ గురించి ఎక్కువ కవరేజ్ ఇచ్చింది .

ఇదంతా భారత్ ఆడుతున్న మైండ్ గేమ్ అని అమెరికాతో సహా చాలా దేశాలు పసిగట్టాయి.. అయినా శత్రువు ఏమీ చేయలేని పరిస్థితి .

బలవంతుడ్ని , అగ్రరాజ్యం అనే అహంకారం చూపిస్తే మా బలం ఇలా ఉంటుంది అని బొమ్మ ద్వారా మెసేజ్ ఇచ్చారు .

ఈ మధ్యలో మోడీ ఎక్కడా ట్రంప్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. ఆయన తన గేమ్ ను చైనా సమావేశంతో ఆపలేదు . రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను భారత్ కు రప్పించి ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలను చేసుకున్నారు . పుతిన్ ను రిసీవ్ చేసుకోవడానికి మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లడం శత్రువుకి మెసేజ్ ఇవ్వడంలో భాగమే .

అంతటితో కూడా ఆగలేదు .. గంటల్లో సౌదీ నేతతో ఒప్పందాలు చేసుకున్నారు .

ఇవన్నీ మైండ్ గేమ్ లో భాగమే .. ఈ గేమ్ లో మోడీ ఎక్కడా తొందరపడలేదు .. ఒక్కొక్క పావును కదుపుకుంటూ వచ్చారు .

అలా అని అమెరికాని విస్మరించలేదు .. విదేశాంగ మంత్రిని అక్కడికి పంపి దౌత్య మార్గాల ద్వారా రాయబారాలు నడిపారు . ఒకపక్క ఆ దేశంతో రాయబారాలు నడుపుతూనే చదరంగంలో అసలైన పావును మోడీ రంగంలోకి దించారు . అదే ఈయూ తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ పేరిట కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు.. ఈ ట్యాగ్ లైన్ తగలాల్సిన చోట తగిలింది .

భారత్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి యూరప్ దేశాలు తరలి వస్తున్న సంగతి అర్ధమవ్వాల్సిన వాళ్లకు అయ్యింది . యూరప్ దేశాలు కూడా ఆర్థికంగా సుస్థిరంగా ఉన్న ఆసియా దేశాలతో వాణిజ్యం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి . ప్రస్తుతం వాటి కంటికి భారత్ కనిపించింది .

భారత్ తో వాణిజ్యం చేయడం వల్ల వాళ్లకు కొన్ని లాభాలు ఉన్నాయి.. ఆసియాలో వాణిజ్య పరంగా భారత్ లో మంచి మార్కెట్ ఉంటుంది . ఆర్థికంగా కానీ , పాలన పరంగా కానీ సుస్థిరమైన ప్రభుత్వం ఉండటం కలిసొచ్చే అంశం. పోలిక కాదు కానీ పాకిస్తాన్ , బంగ్లాదేశ్ లు అరిచి గీ పెట్టినా ఆ దేశాలతో ఒప్పందం చేసుకోవడానికి ఎవరూ ముందుకురారు .

మోడీ మేడ్ ఇన్ ఇండియా పాలసీ తీసుకొచ్చిన తర్వాత స్వదేశీ వస్తువులకు మంచి మార్కెట్ లభిస్తుంది . మన దేశం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రక్షణ రంగానికి సంబందించిన పరికరాలను అనేక దేశాలు కొనుగోలు చేస్తుండటమే అందుకు ఉదాహరణ .

శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతున్న సంగతి ట్రంప్ కూడా గుర్తించాడు . అందుకే రష్యా , వెనిజులా , కెనడా వంటి దేశాల మీద అడ్డదిడ్డంగా మాట్లాడిన ట్రంప్ భారత్ విషయానికి వస్తే సంయమనం పాటిస్తున్నారు . ఎక్కడా అగ్రెసివ్ స్టేట్మెంట్లు లేవు .

ఈ మధ్య దావోస్ వచ్చినప్పుడు కూడా మోడీ నా ఫ్రెండ్ . త్వరలో భారత్ తో మంచి డీల్ కుదుర్చుకోబోతున్నాం అని చెప్పాడే కానీ విరుద్ధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు . ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ మీద విధించిన టారిఫ్ లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ నిన్న ప్రకటన చేసారు . ఇది చైనా , పాకిస్తాన్ టారిఫ్ లకన్నా తక్కువ .

నిజంగా ట్రంప్ ప్రకటన భారత్ విజయమే .. మోడీ ఆడిన మైండ్ గేమ్ లో ట్రంప్ నిలబడలేకపోయారు.. మా మాట వినకపోతే 25 శాతం కాదు వంద శాతం టారిఫ్ విధిస్తా అని హెచ్చరించినవాడు మోడీ ఒక్కమాట కూడా మాట్లాడకుండానే 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాడు .

రష్యాతో ముడిచమురు వాణిజ్యం నుంచి భారత్ ఉపసంహరించుకుంది కాబట్టే టారిఫ్ లు తగ్గించినట్టు ట్రంప్ చెప్తున్నా అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి కాబట్టి మనకొచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు .

ఇది పూర్తిగా భారత్ విజయమనడానికి ఉదాహరణ షేర్ మార్కెటే.. ట్రంప్ ప్రకటన దరిమిలా సెన్సెక్స్ ఒక్కసారిగా పైకి ఎగబాకింది . అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మోడీ ఏం మాయ చేస్తున్నారో తెలీదు కానీ ట్రంప్ తో సహా ప్రపంచ దేశాధినేతలు ఆయనకు బ్రహ్మ రధం పడుతున్నారు .

ఈ ఎపిసోడ్లతో ఒక విషయం అర్ధమౌతుంది .
భారత్ సూపర్ పవర్ దేశంగా ఎదగటానికి ఎంతో సమయం పట్టదు .


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!